
రాష్ట్రపతి భవన్ భారతదేశపు రాష్ట్రపతి యొక్క అధికారిక నివాస స్థలం. ఇది భారత దేశ రాజధానియైన కొత్త ఢిల్లీ లో ఉంటుంది.
అప్పుడు వలస పాలకులైన బ్రిటిష్ వారి పరిపాలన క్రింద ఉండేది భారత దేశం. అప్పటివరకు భారత దేశానికి రాజధానిగా వున్న కలకత్తా నుండి రాజధానిని 1911 వ సంవత్సరంలో ఢిల్లీకి మార్చాలని తల పెట్టాడు నాటి బ్రిటిష్ రాజు జార్జ్- 5. అప్పటికే ఢిల్లీలోని పురాతన భవనాలను, ఇతర కట్టడాలను చూసిన రాజు బ్రిటిష్ రాజ ప్రతినిధుల కొరకు ఒక నగరాన్ని వారి నివాసానికి ఒక అద్బుతమైన పెద్ద భవనాన్ని నిర్మించాలని తలపెట్టాడు. అతని ఆలోచన రూపమే ఢిల్లీప్రక్కనే నిర్మితమైన కొత్తఢిల్లీ నగరం . అందులోని నేటి రాష్ట్రపతి భవనము. ఈ భవన నిర్మాణానికి రూప కల్పన చేసినది లుట్యెంస్. దీని నిర్మాణానికి హగ్ కీలింగ్ చీఫ్ ఇంజనీరుగా పని చేశారు. దీని నిర్మాణంలో భారతీయ, మొగల్ నిర్మాణ రీతులు కనిపిస్తాయి. ఈ నిర్మాణంలో తలమానికమైన బారీ డోం. ఇది భౌద్ద నిర్మాణాలను తలపిస్తుంది.
స్వాతంత్య్రానంతరం ఈ భవనంలోనికి అడుగు పెట్టిన మొదటి వ్వక్తి అప్పటి మొదటి భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి. ఆ తర్వాత భారత దేశం గణతంత్రంగా ఆవిర్భవించడంతో రాష్ట్ర పతి పదవి వచ్చింది. రాష్ట్ర పతి నివాసానికి కేటాయించిన ఈ భవనానికి నాడు రాష్ట్రపతి భవన్ గా నామ కరణం చేశారు. అప్పుడు రాజాజీ వుండిన గదుల్లోనే ఇప్పటికి వరకు మన రాష్ట్రపతులందరు ఉంటున్నారు. బ్రిటిష్ వైస్రాయ్ లు ఉపయోగించిన గదులను మాత్రము మన దేశ పర్యటనకు వచ్చిన విదేశాధినేతలకు కేటాయిస్తున్నారు.
ఈ రాష్ట్రపతి భవనంలో మొత్తం 340 గదులుండగా.... దర్బారు హాలు, అశోకాహాలు, డైనింగు హాలు, మొగల్ గార్డెన్ లను మాత్రమే సందర్శకులకు అనుమతిస్తారు. రంగు రంగు చలువ రాళ్లతో మనోరంజకంగా వుండే దర్బారు హాలులో జాతీయ అవార్డుల ప్రధానోత్సవాలకు ఉపయోగిస్తారు. అందమైన షాండియర్లు అలంకరించిన అశోకా హాలు మంత్రుల ప్రమాణ స్వీకరణోత్సవాలకు ఉపయోగిస్తారు. డైనింగు హాలో ఒకేసారి 104 మంది కూర్చొని బోజనం చేయవచ్చు. వారి భోజనానికి వెండి పాత్రలను ఉపయోగిస్తారు.
ఈ భవనాన్ని రాంత్రింబవళ్లు కాపలాకాయడానికి వెయ్యి మంది ఢిల్లీ పోలీసులుంటారు. బ్లాక్ కమెండోలు కూడ వుంటారు. ఈ కాపలా దారులంతా అశ్వ, నావిక, వైమానిక దళాలలో శిక్షణ పొంది వుండాలి. వీరందరు ఆరడుగుల పైనే పొడవుండాలి. రాష్ట్రపతి ఈ భవనం నుండి బయట కాలు పెడితె చాలు ..... అది అరగంట పనైనా...... సుధీర్ఘ విదేశ పర్యటన అయినా.... అతను బయటకు వెళ్లే టప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు... వీడ్కోలు, పలకడానికి, వచ్చినప్పుడు ఆహ్వానము పలకడానికి 150 మంది సిక్కు సైనిక దళం సర్వ వేళలా సిద్దంగా వుంటుంది. ఇతర దేశాధిపతులకు కూడ వీరె ఆహ్వానం, వీడ్కోలు పలుకు తారు.
రాష్ట్రపతి కుటుంబానికి, అక్కడికి వచ్చే అతిధులకు అవసరమైన వంటకాలను తయారు చేయడానికి 18 మంది వంట మనుషులు, వడ్డించ డానికి 10 మంది బట్లర్లు వుంటారు. గదులను ఊడ్చడానికి శుబ్రంగా వుంచడానికి 110 మంది పని వాళ్లుంటారు. అంతేగాక 10 మంది డ్రైవర్లు, ఐదుగురు మెకానిక్కులు, 180 మంది అంగ రక్షకులు, ఇంకా డాక్టర్లు, సెక్రెటరీలు, క్లర్కులు, మొదలగు వారందరూ కలిపి 1000 మంది పైగానె పని చేస్తుంటారు. రాష్ట్రపతి ప్రయాణించడానికి ఎస్ క్లాస్ 600 పుల్ ల్మన్ గార్డ్ మెర్సిడెజ్ కారును ఉపయోగిస్తారు. ఈ రాష్ట్రపతి భవన్ నిర్వహణ ఖర్చు ఏడాదికి వంద కోట్ల రూపాయలకు పైనే వుంటుంది.
ఈ రాష్ట్రపతి భవన ఆవరణములో అందమైన ఉద్యాన వనాలున్నాయి. అవి మొఘల్ గార్డెన్, హెర్బెల్ గార్డెన్, న్యూట్రిషన్ గార్డెన్, స్పిరిచ్యుల్ గార్డెన్ వంటివి వున్నాయి. వాటి బాధ్యతలను చూడడానికి 150 మంది తోట పని వారుంటారు. ఈ ఉద్యాన వనాల్లో ప్రధానాకర్షణ మొగల్ గార్డెన్. ఇందులో మామిడి, సపోట జామ, అరటి వంటి పండ్ల చెట్లే గాక వేప, మర్రి, రావి లాంటి వృక్షాలు కూడ వున్నాయి. ఈ గార్డెన్ లో 8 టెన్నిస్ కోర్టులు, ఒక గోల్ఫు మైదానము, ఒక క్రికెట్ మైదానము కూడ వున్నాయి. అబ్దుల్ కలాం పదవీ కాలంలో రాష్ట్రపతి భవన్ లో అదనంగా సైన్స్ మ్యూజియం, చిల్డ్రన్ గ్యాలరి, కిచెన్ మ్యూజియం, హెర్బల్ గార్డెన్ అదనంగా చేరాయి.